లైసెన్స్‌లు రద్దు చేస్తామన‌డం పరిధికి మించి మాట్లాడటమే

RS Praveen Kumar Press Meet. వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ మాట్లాడటం తన పరిధికి

By Medi Samrat  Published on  26 Oct 2021 2:28 PM GMT
లైసెన్స్‌లు రద్దు చేస్తామన‌డం పరిధికి మించి మాట్లాడటమే

వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ మాట్లాడటం తన పరిధికి మించి మాట్లాడటమేన‌ని బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ పట్టణంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి పుష్కలమైన నీరు రైతులకు అందించి ఇప్పుడు వరి వద్దంటే రైతుల పరిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి సంవత్సరం మూడు వేల నుంచి నాలుగు వేల కరెంటు బిల్లులు కడుతూ ఇప్పుడు వరి వేయకూడదు అంటే రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యగా దీన్ని భావిస్తున్నమని ఆయ‌న అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరలు చూపించకుండా.. వరి వేయకూడదు అనే ఆలోచనను.. ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నారు. ఇప్పటివరకు చెరుకు మిల్లులు లేవు.. మక్కల పరిస్థితి దారుణంగా ఉంది.. పత్తికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ జిన్నింగ్ మిల్లులు లేవు. రాష్ట్రంలో ఫుడ్ పరిశ్రమలు లేవని వివ‌రించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాగు కోసం ఫామ్ హౌస్ లో 365 రోజులు నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టించుకున్నారని విమ‌ర్శించారు. కరీంనగర్ ముంపు గ్రామాలలో వందలాది ఎకరాలు మునిగిపోయాయని ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.


Next Story