తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం
తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik
తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం
తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ప్రధాన ప్రైవేట్ సంస్థ అయిన కిషాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ కంపెనీ ట్యాక్స్ మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు సంస్థ యొక్క ఎస్పి రోడ్, హైదరాబాద్లోని కార్పొరేట్ కార్యాలయం, సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట్ గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లపై సమన్వయంగా తనిఖీలు చేపట్టడంతో ఈ మోసం బయటపడింది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ సంస్థ అసలు సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అనుమానం ఉంది. ఖాళీ వాహనాలను తెలంగాణ నుండి మహారాష్ట్రకు పంపించగా, డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. వాహనాలు రద్దీ లేని పరిస్థితిలోనూ, ఈ-వే బిల్లులపై వాటిని సరుకులతో వెళ్ళినట్టు చూపారు. సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు కనుగొన్నారు.
కాగా ఇది తెలంగాణలో గుర్తించి మొదటి రకం జీఎస్టీ మోసంగా అధికారులు భావిస్తున్నారు. తనిఖీల సందర్భంగా అధికారులు ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీ కి అధికారిక ఫిర్యాదు చేశారు.