రాజయ్య, శ్రీహరిల‌పై కేసీఆర్‌కే నమ్మకం లేదు : రేవంత్ రెడ్డి

ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  14 Nov 2023 9:47 AM GMT
రాజయ్య, శ్రీహరిల‌పై కేసీఆర్‌కే నమ్మకం లేదు : రేవంత్ రెడ్డి

ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రాజయ్య, శ్రీహరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు.. రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు.. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లే. ఇద్దరి జాతకాలు తెలుసు కాబట్టే ఉద్యోగం ఇచ్చి మధ్యలోనే ఊడగొట్టిండు.. కేసీఆర్ కే వీళ్లపై నమ్మకం లేదు.. అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు రేవంత్‌.

స్టేషన్ ఘనపూర్ కు వందపడలకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత నాది.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందని తెలిపారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదన్నారు. తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకుండు.. దద్దమ్మ దయాకర్ రావును మంత్రిని చేసిండని విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఈ దద్దమ్మ దయాకర్ రావు వాళ్లను ఖాళీ సీసాలు అమ్ముకోమంటారా.? అని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే 30లక్షల మంది నిరుద్యోగ యువకులు అడవి బాట పట్టే పరిస్థితి వస్తుందన్నారు. నిరుద్యోగ యువతి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే.. ఈ ప్రభుత్వం ఆ కుటుంబం పరువును బజారుకీడ్చిందన్నారు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగింది. పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి..ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నేల కూలలాల్సిందన‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెలా రూ.2500, రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తామ‌న్నారు. ఆనాడు 9 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ అని.. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ద‌ని పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని తెలిపారు. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిచే బాధ్యత కాంగ్రెస్ దని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ లో ఇందిరమ్మను 25వేల మెజారిటీతో గెలిపించండి.. ఇక్కడ ఇందిరమ్మను గెలిపిస్తే అక్కడ సోనియమ్మను గెలిపించినట్లేన‌న్నారు.

Next Story