దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండి : రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనగామలో జ‌రిగిన కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు.

By Medi Samrat  Published on  15 Nov 2023 2:45 PM GMT
దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండి : రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనగామలో జ‌రిగిన కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ జనసందోహాన్ని చూస్తుంటే కాలనాగుల పని పట్టడానికి పుట్టలోనుంచి చీమలు బయటకు వచ్చినట్లుందని అన్నారు. జనగామలో పల్లాను ఓడించి బొంద పెట్టడానికి వచ్చిన మీకు అభినందనలు అని వ్యాఖ్యానించారు. పొన్నాల లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతదేమో అనుకున్నా.. కానీ మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చిందన్నారు.

కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొడతామని నిరూపించారన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి చెప్పిండు.. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసన్నారు.

ఈ ప్రాంతంలో మట్టికి ఒక పౌరుషం ఉంది.. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది.. పొన్నాల కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా? అని ప్ర‌శ్నించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి పొన్నాల శత్రువు పంచన చేరాడని విమ‌ర్శించారు.

అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్ పంచన చేరాడని ఆరోపించారు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాహిళలకు ప్రతీ నెల రూ.2500.. రూ.500లకే గ్యాస్ సిలిండర్.. రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు.. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు.. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్థికసాయం అందిస్తామ‌ని పేర్కొన్నారు.

ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్ లోకి కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదన్నారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంది లేకుంటే ఏంది? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఉంటే మీకు వచ్చే పెన్షన్ రూ.2 వేలు.. కేసీఆర్ ను బొందపెడితే రూ.4 వేలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తామ‌ని వ్యాఖ్యానించారు.

Next Story