రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Open Letter to Telangana Farmers. తెలంగాణ రైతు లోకానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  16 July 2023 10:00 AM GMT
రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతు లోకానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు. రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరిందని ఆరోపించారు. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించిందని మండిప‌డ్డారు. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాం. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయింది. ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందని.. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు అని వివ‌రించారు.

రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం.. రైతులను నిలువునా మోసం చేసిందని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో.. రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.

జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుంది. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదు.. కానీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలింది. కానీ, కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుందని విమ‌ర్శించారు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే దీనికి సాక్ష్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అందుకే అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లను వెనక్కు తెప్పించుకుందని ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని అన్నారు. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు అని ఎద్దేవా చేశారు. రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదావకాశం. ఈ సమావేశాల్లో మన సమస్యలపై నిలదేసేందుకు సిద్ధంకండని పిలుపునిచ్చారు.

రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించుడో.. బీఆర్ఎస్ ను బొంద పెట్టుడో తేల్చేద్దామ‌న్నారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం. ఇందుకు యావత్ తెలంగాణ రైతు లోకం సిద్ధం కావాలి.. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Next Story