దివాళా తీసిన కంపెనీకి ధరణి బాధ్యత : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On CM KCR. సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టిన తప్పు లేదని

By Medi Samrat  Published on  14 Jun 2023 1:43 PM GMT
దివాళా తీసిన కంపెనీకి ధరణి బాధ్యత : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టిన తప్పు లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులందరూ కేసీఆర్, కేటీఆర్ లను చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టినా తప్పు లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి మాటలు అనటానికి తాము ఏ మాత్రం భయపడటం లేదన్నారు రేవంత్ రెడ్డి. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. ధరణి దోపిడీపై శోధిస్తున్నా కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు కట్టబెట్టారు. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టల్ ద్వారా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ నిర్వహిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వాస్తవానికి దివాళా తీసిన కంపెనీ. గతంలో రూ.90 వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను నిండా ముంచింది. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పుని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్..ధరణి నిర్వహణ కోసం సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో 52.26 శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1275 కోట్లకు 2021, నవంబర్ 25న అమ్ముకుంది. కొనుగోలు చేసే కంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్ కంపెనీని 2021, అక్టోబర్లో ప్రారంభించారు. ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపీనికి ఇచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి శ్రీధర్ రాజు చేరారు. దాంతో ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది.

‘‘ ప్రజల భూముల వివరాలన్నింటినీ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు. ఐఎల్‌ఎఫ్ సంస్థలో ఫిలిప్పీన్‌కు చెందిన కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. ప్రజల భూముల వివరాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నా. ధరణి నిర్వహణపై ఐఎల్‌ఎఫ్ సంస్థతో రూ.150కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఐఎల్‌ఎఫ్ఎస్‌ సంస్థకు చెందిన 99శాతం వాటాను టెరాలసిస్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది.70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్‌ఎఫ్‌ సంస్థకు విక్రయించారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

‘‘ శ్రీధర్ రాజుకు, కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు. సత్యరామలింగరాజు కుమారులకు శ్రీధర్ రాజుకు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ మూడేళ్లు కష్టపడి రూపొందించిన అంటున్నారు. కానీ కేసీఆర్ అసలు సిగ్గుందా? ఒడిశా ప్రభుత్వం 2008లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. దీన్ని నిర్వహణను కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు అప్పగించింది. ధరణి పోర్టల్ ను ఉపయోగిస్తే... అంతా తప్పుల తడకగా ఉందని కాగ్ రిపోర్టు ఇచ్చిందని రేవంత్ చెప్పారు. ధరణితో నష్టం వచ్చిందని కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారని వివరించారు. ఒడిశాలోనూ ILFS సంస్థే ధరణిని నిర్వహించిందని, అలాంటి సంస్థతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. ఇంత జరిగితే కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్ఠించినట్టు చెప్పారని ఎద్దేవా చేశారు.

ధరణిలో ఇప్పటివరకు 25 లక్షల లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.50వేల కోట్ల లావాదేవీలు జరిగాయని అంచనా. ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లడం లేదు. ఇవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఇక్కడే అసలు మతలబు ఉంది. రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదు. మక్తల్ కు చెందిన ఆంజనేయులు గౌడ్ ఒక ఉదాహరణ. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని ఐదు లక్షల రూపాయలు చెల్లించాడు. కానీ రిజిస్ట్రేషన్ రోజున వెళ్లకపోవడంతో రిజిస్ట్రేషన్ కాలేదు. సంబంధిత వర్గాలను అడిగే రిఫండ్ చేశామని సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ఆన్లైన్లో మాత్రం డబ్బులు రిఫండ్ కాలేదు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి? అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ధరణిలో లావాదేవీల్లో భాగంగా సేకరించే ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది. డేటా ప్రైవసీ ప్రకారం దేశ పౌరుల డేటాను విదేశీయులు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. ధరణి దోపీడీని మేం బయట పెడితే.. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి ద్వారా జరిగిన లావాదేవీలతో వచ్చిన రూ.50 వేల కోట్లలో రూ. 40 వేల కోట్లు ప్రభుత్వానికి వెళ్లాయని కొంత మంది అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా.. అవాస్తవమా విచారణ చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే ధరణి లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదిక కోరాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా అన్నారు. భారతీయుల డేటాను ఇతర దేశాలకు ఇచ్చినందుకు.. సంబంధిత అధికారులను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కోరారు. ధరణి పోర్టల్ సింపుల్ సాఫ్ట్ వేర్ కాదన్నారు. దోపిడీ చేసేందుకే ధరణి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం.. అవసరమైతే కోర్టు తలుపు తడతాం. దోపిడీ బయటపడుతుందనే నా ఆరోపణలపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అందుకే కేసీఆర్ రైతులను, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధరణిలోపాలు లేకుంటే కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దోషిగా నిలబడింది? 33 రకాల తప్పులు ఉన్నట్లు నవీన్ మిట్టల్ హైకోర్టు ముందు ఎందుకు ఒప్పుకున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉంది. తెలంగాణ భూమిలన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు. శ్రీధర్ రాజు ఏ యువరాజుకు దగ్గరి వాడో తేలాలి. చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్ పై ఎందుకు విచారణకు అదేశించడంలేదు? దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్ర పెద్దలే చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసులపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “అరవింద్ కుమార్ లీగల్ నోటీసులను రిజిస్టర్ పోస్టు లేదా పర్సన్ ద్వారా నాకు పంపాలి.. కానీ పబ్లిక్ డొమైన్ లో ఎలా పబ్లిష్ చేస్తారు... మీడియాకు ఎలా రిలీజ్ చేస్తారు? ఉద్దేశపూర్వకంగానే అరవింద్ కుమార్ నా ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించారు. రాజకీయంగా ఇతర పార్టీలకు లాభం చేకూరేలా ప్రవర్తించారు” అని అరవింద్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓఆర్ఆర్ సగ భాగం వరకు నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఓఆర్ఆర్ టెండర్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రక్రియ ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం, ఎన్ హెచ్ఎఐ నిబంధనలను పట్టించుకోకపోవడం, ఐఏఎస్ అధికారి స్థానంలో రిటైర్డ్ అధికారితో టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం వంటి సందేహాలకు అరవింద్ కుమార్ సమాధానం ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. ఒక ప్రజాప్రతినిధిగా నేను సందేహాలకు సమాధానం ఇవ్వకపోగా రాజకీయ నాయకుడిగా మాదిరిగా వ్యవహరించారు. 1968 ఇండియన్ సర్వీసెస్ రూల్స్ మేరకు ఒక ప్రజాప్రతినిధితో ఒక అధికారి వాడని భాషను అరవింద్ ఉపయోగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. క్రిసిల్ నివేదిక, మేజర్స్ నివేదిక, టెండర్ బేస్ ప్రైస్, గత మూడేళ్లుగా నెలనెలా ఓఆర్ఆర్ ఆదాయం వివరాలను వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు.


Next Story