హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డులు మరో రెండు లక్షలకు పెరిగాయి. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. లబ్ధిదారులు 3.10 కోట్లకు పెరిగారు. దరఖాస్తులను వెరిఫై చేసి అధికారులు 2 లక్షల మందికి కొత్తగా కార్డులు ఇచ్చేందుకు అనుమతించారు. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా సాగుతోందని, కొత్తగా అప్లయ్ చేసుకున్నా అర్హులకు రేషన్ కార్డు లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నెలలో ఒకేసారి 3 నెలలకు సన్నబియ్యం తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రజాపాలనతో పాటు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది.
దీంతో అర్హులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డులలో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసినవారు కూడా ఎటువంటి స్పందన లేక ఎదురుచూపులతోనే ఉన్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో సబ్సిడీ ధాన్యాలు, ఇతర సంక్షేమ పథకాలైన ఆరోగ్య శ్రీ, పింఛన్లు వంటి సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.