కేసీఆర్ రైతు రాజ్యం గురించి మాట్లాడటం విడ్డూరం : పొన్నాల

Ponnala Laxmaiah Fire On CM KCR. దేశంలో రైతు రాజ్యం తీసుకొస్తానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌ని మాజీ మంత్రి

By Medi Samrat  Published on  30 Dec 2022 9:11 AM GMT
కేసీఆర్ రైతు రాజ్యం గురించి మాట్లాడటం విడ్డూరం : పొన్నాల

దేశంలో రైతు రాజ్యం తీసుకొస్తానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌ని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రైతులకు బేడీలు వేసిన కేసీఆర్ రైతు రాజ్యం గురించి మాట్లాడటం విడ్డూరం అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ ఎందుకు చేయలేదో కేసీఆర్ చెప్పాలని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో 16 లక్షల మంది రైతులు బ్యాంక్ లు, లోన్ లు ఇవ్వక ప్రవేట్ రుణాలు అధిక వడ్డీకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. పంట నష్టరిహారం లేదు.. మద్దతు ధర లేదు.. పండించిన పంటను అమ్ముకొలేని దుస్థితిలో రైతులు ఉన్నారని అన్నారు.

రైతుబందులో అనర్హులు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు.. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో దేశంలో జాతీయ పార్టీ అంటూ బయలు దేరాడని విమ‌ర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీ దేశంలో దోపిడీ కోసమేన‌ని వ్యాఖ్యానించారు. 12 శాతం రిజర్వేషన్ లపై దేశంలో ఏం చెబుతారని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ది దొంగ పాసుపోర్టుల చరిత్ర అని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల హామీలు అమలు చేయలేదని దేశంలో చెబుతారా అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో చెప్పగలవా అని కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. విద్యుత్ కొనుగోళ్ళపై సర్కార్ పెద్దలు చర్చకు వస్తారా అని స‌వాల్ విసిరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ధరణి పోర్టల్ పెయిల్యూర్స్ కేసీఆర్‌కు కనిపించడం లేదని విమ‌ర్శించారు. కేసీఆర్ హయాంలో చెబుతున్న ఐటి హబ్ లు అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేన‌ని అన్నారు.

తెలంగాణకు ఏమీ చేయలేని బీజేపీ నాయకులు.. ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని విమ‌ర్శించారు. విభజన హామీలు ఒక్కటైన అమలు చేశారా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వాలను కూల్చే బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమెంతో ప్రజలకు తెలుసు.. బీజేపీ 90 సీట్లు అనే కంటే 119 అంటే బాగుండు అని సెటైర్లు సంధించారు.


Next Story