ప్రభుత్వ భూములు కబ్జా చేసే అక్రమార్కుల భరత పడతాం: పొంగులేటి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు

By -  Knakam Karthik
Published on : 12 Jan 2026 11:50 AM IST

Telangana, Ponguleti Srinivasreddy, Congress Government, Government Lands, Encroachments

ప్రభుత్వ భూములు కబ్జా చేసే అక్రమార్కుల భరత పడతాం: పొంగులేటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి మండలం లో ఎస్.ఎస్.ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాలలో సమీకృత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి – నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) భవనంలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని జూన్ నాటికి ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్ తోనే ఈ 12 స‌మీకృత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేగాక స‌మీకృత భ‌వ‌నాల‌ను నిర్మించే సంస్ధ‌లే క‌నీసం ఐదేళ్ల‌పాటు వాటిని నిర్వ‌హించాల‌న్న నిబంధ‌న కూడా పొందుప‌రిచామ‌ని తెలిపారు.

ఇక్క‌డ కొత్త‌గా పెళ్ల‌యి రిజిస్ట్రేష‌న్ కు వ‌చ్చే జంట‌లు, చిన్న పిల్ల‌ల‌తో వ‌చ్చే త‌ల్లులు, పేద‌ల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు ఉంటాయ‌ని తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూస్తోందని స్పష్టం చేశారు. గ‌త రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాకు డ‌బ్బు చేకూర్చాల‌నే ఆలోచ‌న కాకుండా పేద‌వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని మంత్రి తెలిపారు. పేద‌ల‌కు గ‌తంలో ఇచ్చిన భూముల‌తోపాటు ప్ర‌భుత్వ భూముల‌ను ప‌రిర‌క్షిస్తామ‌ని, ఈ విష‌యంలో ఉక్కుపాదంతో అక్ర‌మాల‌ను అణ‌చివేస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షాల‌తో విమ‌ర్శించుకునే ప‌రిస్ధితి రాకుండా పేద‌ల ప‌క్షాన ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని స్ఫ‌ష్టం చేశారు.

Next Story