ధర్పల్లిలో ఉద్రిక్తత.. ఎస్సైకు గాయాలు
Police officer injured during TRS-BJP workers clash in Nizamabad. నిజామాబాద్ ఎంపీ ధర్మాపూర్ అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ
By Medi Samrat Published on 19 Feb 2022 7:45 AM GMT
నిజామాబాద్ ఎంపీ ధర్మాపూర్ అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బీజేపీ కార్యకర్తలు, నిరసనకారులతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేయడంతో ధర్పల్లి మండలంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్పల్లిలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న నిరసనకారులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని నిరసనకారులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే వాదనలు తోపులాటకు దారితీసి రాళ్లు రువ్వుకున్నారు.
జిల్లాకు పసుపుబోర్డు మంజూరు చేయిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని, ఎన్నికల వాగ్దానాన్ని ఎలా విస్మరించారని నిరసనకారులు ఎంపీ అరవింద్ను నిలదీయడానికి సిద్దమయ్యారు. బీజేపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరస్పరం వాదనలతో తోపులాటకు దిగిన ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో.. సబ్ఇన్స్పెక్టర్ వంశీకృష్ణారెడ్డి తలకు గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తలు కావాలనే నిరసనలకు దిగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.