'పోలీస్‌స్టేషన్‌ ఎవరూ సరదాగా రారు'.. పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని హైకోర్టు పేర్కొంది.

By అంజి  Published on  17 Feb 2024 2:07 AM GMT
Police, people, Telangana, High Court

'పోలీస్‌స్టేషన్‌ ఎవరూ సరదాగా రారు'.. పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులను పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్న హైకోర్టు.. ప్రజల కోసం పోలీసులున్నారని కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి చెప్పాలని అదనపు ఏజీకి సూచించింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని హైకోర్టు పేర్కొంది. న్యాయవాదులు, డాక్టర్లతో పాటు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని కోరుకోరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది.

తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఓ మహిళ కరీంనగర్ 2వ పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో బాధిత మహిళహైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశంతో ఎస్‌హెచ్‌ఓ ఓదెల వేంకటేశ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ వాదనలు వినిపిస్తూ.. 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణ కోరారు. తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఎస్‌హెచ్‌ఓ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Next Story