బీజేపీ నేత‌ల‌కు వండి వ‌డ్డించ‌డం నా అదృష్టం : యాద‌మ్మ‌

PM Modi To Taste Telangana Special Food.హైద‌రాబాద్ వేదిక‌గా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 7:32 AM GMT
బీజేపీ నేత‌ల‌కు వండి వ‌డ్డించ‌డం నా అదృష్టం : యాద‌మ్మ‌

హైద‌రాబాద్ వేదిక‌గా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు. బీజేపీ పార్టీ ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. సాయంత్రం సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. నేడు(ఆదివారం) మ‌ధ్యాహ్నాం ప్ర‌ధానితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల కోసం రాష్ట్ర నేత‌లు స్పెష‌ల్ మెనూను ఏర్పాటు చేశారు.

బీజేపీ దిగ్గ‌జాలు తెలంగాణ రుచుల‌ను చూడ‌బోతున్నారు. ఉమ్మ‌డి క‌రీంగ‌న‌ర్ జిల్లా హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని గౌర‌వెల్లి గుడాటిప‌ల్లెకి చెందిన యాద‌మ్మ చేతితో చేసిన వంట‌కాల‌ను ప్ర‌ముఖులు రుచి చూడ‌నున్నారు. భోజ‌నంతో పాటు తెలంగాణ స్టైయిల్‌లోనే స్నాక్స్‌ను కూడా త‌యారు చేయించారు. స్వీట్స్ స‌హా దాదాపు 50 ర‌కాల వంట‌కాల‌ను సిద్దం చేశారు.

కూరల విషయానికొస్తే..

చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ

స్వీట్స్.. బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు

స్నాక్స్.. విషయానికొస్తే.. పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి,

నా అదృష్టం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాలను నా చేతితో వండి వడ్డించే అవకాశం రావడం నా అదృష్టం, నా జన్మ ధన్యమైందని యాద‌మ్మ అన్నారు. ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్ కు శతకోటి దండాలు. ఆయనకు రుణపడి ఉంటాన‌ని ఆమె తెలిపారు.

Next Story