ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ఎదుటకు వచ్చారు.
By - అంజి |
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ఎదుటకు వచ్చారు. అయితే విచారణకు ప్రభాకర్రావు సహకరించడం లేదని సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అధికారులు వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ప్రభాకర్రావు సెల్ఫోన్ పాస్ వర్డ్లు ఇవ్వడం లేదని సిట్ అధికారులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి ఉన్న డేటాను ధ్వంసం చేయించారని.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయాన్ని కూడా ప్రభాకర్ దాచి పెట్టారని సిట్ పేర్కొంది. కస్టోడియల్లో విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని.. అందుచేత ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ రద్దు చేసి కస్టోడియల్ విచారణకు అనుమతించాలని సిట్ కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ముందస్తు బెయిల్ను సడలిస్తూ ప్రభాకర్రావును..
కస్టోడియల్ విచారణకు అనుమతించింది. నేటి నుంచి వారంపాటు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈరోజు ఉదయం ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ ను జాయింట్ సీపీ తఫ్సర్ ఇక్బాల్ విచారిస్తున్నారు. రూల్ నెంబర్ 419, 419A నిబంధనలు ఉల్లగించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణ లో తేలింది. 26 హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసినట్లు గుర్తింపు , అందులో 7 కొత్త హార్డ్ డిస్క్ లు రీ ప్లేస్ చేయడంపై సిట్ విచారణ చేపట్టింది. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ధ్వంసం చేసిన 26 హార్డ్ డిస్క్ లు ఎక్కడ దాచిపెట్టారనే దానిపై విచారణ కొనసాగుతోంది.