ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డా. పట్టాభిరామ్ గారు మెజీషియన్గా, హిప్నాటిస్టుగా, రచయితగా, సైకాలజిస్ట్గా, కౌన్సిలర్గా విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. ఆయనకు భార్య జయ, కొడుకు ప్రశాంత్ ఉన్నారు. ఆయన మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీవీ పట్టాభిరాం పూర్తి పేరు భావరాజు వెంకట పట్టాభిరామ్. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి. పట్టాభిరామ్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పలు రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రుల అవగాహన సదస్సులు నిర్వహించారు.