'తెలంగాణలోనూ యాత్ర చేస్తా'.. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్రానికి వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే తాను బీజేపీతో చేతులు కలిపానని పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి Published on 23 Nov 2023 6:34 AM IST
'తెలంగాణలోనూ యాత్ర చేస్తా'.. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే తాను బీజేపీతో చేతులు కలిపానని సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ బుధవారం అన్నారు. నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి-జెఎస్పి అభ్యర్థుల కోసం జనసేన పార్టీ (జెఎస్పి) నాయకుడు హన్మకొండలో బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
దళితుడిని మొదటి సీఎంని చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైనందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావుపై ఆయన మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎలో ఒక భాగమైన జెఎస్పి ఈ వాగ్దానానికి మద్దతు ఇచ్చింది.
నవంబర్ 30 ఎన్నికల కోసం సీట్ల షేరింగ్ ఒప్పందం ప్రకారం.. బిజెపి జెఎస్పికి ఎనిమిది సీట్లు వదిలి 111 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపింది. వరంగల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన తొలి ఎన్నికల సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ తెలంగాణకు మద్దతిచ్చే వారిలో తానూ ఒకడినని పేర్కొన్నారు.
‘‘తెలంగాణ నాకు అపారమైన శక్తినిచ్చింది. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో రౌడీలపై పోరాటం చేస్తున్నాను’’ అని అన్నారు. తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తుందని ఆశిస్తూ.. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నట్లే తెలంగాణలోనూ యాత్ర చేస్తానని చెప్పారు. తెలంగాణా అమరుల కోసం మార్పును సాధించి తీరుతానని పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. త్యాగాలతో ఆవిర్భవించిన రాష్ట్రం అవినీతికి బలి కావడం బాధాకరమన్నారు.