విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పండి: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కాదని.. రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
By అంజి
విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పండి: హరీష్ రావు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కాదని.. రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి రూ.12,000 కి పరిమితం చేయడం ముమ్మాటికీ మోసం చేయడమేనన్నారు. గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేనని హరీష్ రావు అన్నారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత అని, ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టారని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు.
''రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా? 1200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా? ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నందుకా? పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతుల చేతులకు బీడీలు వేసినందుకా? ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వనందుకా? ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా జరపనందుకా? జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి, రైతులకు సకాలంలో అందించినందుకా? వరంగల్ రైతు డిక్లరేషన్ ను అటకెక్కించినందుకా? మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? ఎందుకు సంబురాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి'' అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నాడని అన్నారు. బిఆర్ఎస్ ది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మరని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.