తెలంగాణలో విమానాశ్రయాల జోరు..ఆదిలాబాద్, మామునూర్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
By - Knakam Karthik |
తెలంగాణలో విమానాశ్రయాల జోరు..ఆదిలాబాద్, మామునూర్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఆదిలాబాద్లో ప్రతిపాదించిన విమానాశ్రయాన్ని పౌర విమాన సర్వీసులతో పాటు సాయుధ బలగాల శిక్షణ కోసం కూడా వినియోగించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆదిలాబాద్లో ఇప్పటికే 360 ఎకరాల రక్షణ భూమి అందుబాటులో ఉందని, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలను అప్పగించనుందని మంత్రి తెలిపారు. రక్షణ శాఖ అధికారుల బృందం త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల అనుకూలతను పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు, వరంగల్ ప్రజల చిరకాల కోరికైన మామ్నూర్ విమానాశ్రయానికి లైన్ క్లియర్ అయింది. వచ్చే మూడు నెలల్లోనే దీని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి అప్పగించినందున, దీనిని పూర్తిస్థాయి విమానాశ్రయంగా మార్చేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు పెద్దపల్లి జిల్లా అంతర్గాం, కొత్తగూడెంలలో కూడా విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, సాధ్యసాధ్యాలను బట్టి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.