మేడారం జాత‌ర‌కు 10 వేల మంది పోలీసులతో బందోబస్త్ : ములుగు ఎస్పీ

Nearly 10,000 policemen on bandobast duties at Medaram. మేడారం జాత‌ర‌కు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జ‌ర‌గ‌కుండా

By Medi Samrat  Published on  11 Feb 2022 9:51 AM GMT
మేడారం జాత‌ర‌కు 10 వేల మంది పోలీసులతో బందోబస్త్ : ములుగు ఎస్పీ

మేడారం జాత‌ర‌కు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జ‌ర‌గ‌కుండా, అవాంతరాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ శుక్రవారం తెలిపారు. జాతర సందర్భంగా మేడారానికి 1.25 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. ఆలయ సమీపంలో దాదాపు 3.5 లక్షల వాహనాలు, 4 వేల టీఎస్‌ఆర్‌టీసీ బస్సులకు పార్కింగ్‌ స్థలాలను గుర్తించామని తెలిపారు. మొత్తం 10 వేల మంది పోలీసులతో బందోబస్త్ విధుల్లోకి వస్తామని చెప్పారు.

మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు 382 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలు, 20 డిస్‌ప్లే ప్యానెల్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. 37 హోల్డింగ్ పాయింట్లను గుర్తించడంతో పాటు 33 సైట్లలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. పస్రా వరకు ప్రతి నాలుగు కిలోమీటర్ల దూరానికి ఒక పోలీసు అవుట్‌పోస్ట్.. పస్రా నుండి మేడారం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయబడిందని పాటిల్ చెప్పారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు కూడా ట్రాఫిక్ మరియు ప్రజల కదలికలపై నిఘా ఉంచుతాయని చెప్పారు.

అనధికారికంగా పార్క్ చేసిన వాహనాలను లేదా సాంకేతిక లోపాల కారణంగా ఆగిపోయిన వాహనాలను ఎత్తడానికి, ఆరు టోయింగ్ వాహనాలు, 11 క్రేన్లు, 20 బుల్డోజర్లను అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు. కోవిడ్ -19 జాగ్రత్తలను ప్రస్తావిస్తూ.. ప్రతి పోలీసుకు మాస్క్‌లు మరియు శానిటైజర్‌లతో కూడిన కిట్‌ను అందించామని.. ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ పోలీసుల సూచనలను పాటించాలని.. రోడ్లపై వాహనాలను ఎప్పుడూ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించవద్దని ఎస్పీ కోరారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేడారం వచ్చే ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లపై రేడియం స్టిక్కర్లు అతికించడం మంచిదని సూచించారు.


Next Story