వరి సేకరణపై తీర్మానం చేసిన‌ నల్గొండ జిల్లా పరిషత్

Nalgonda Zilla Parishad adopts resolution on paddy procurement. యాసంగి పంటల వరిసాగును రాష్ట్రం నుంచి కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ

By Medi Samrat
Published on : 27 March 2022 1:30 PM

వరి సేకరణపై తీర్మానం చేసిన‌ నల్గొండ జిల్లా పరిషత్

యాసంగి పంటల వరిసాగును రాష్ట్రం నుంచి కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగిన న‌ల్గొండ‌ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి పిలుపు మేరకు సర్వసభ్య సమావేశాన్ని సింగిల్‌ పాయింట్‌ ఎజెండాగా తీర్మానం చేశారు. ఈ అంశంపై సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని నరేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు, గ్రామ పంచాయతీలు, మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు తీర్మానం చేసి తీర్మానం కాపీలను తమ అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల కార్యాలయంలో సమర్పించినట్లు గుర్తు చేశారు.

సభకు హాజరైన ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కె. చంకద్రశేఖర్‌రావు తలపెట్టిన ఉధృత ఆందోళనలో టీఆర్‌ఎస్‌ సభ్యులు, రైతులు పాల్గొనేందుకు సమాయత్తం కావాలని కోరారు. వరి కొనుగోలు చేయకూడదని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో అత్యధిక సంఖ్యలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి పంట సీజన్‌లో రైతులు పండించిన వరిపంటకు మార్కెటింగ్‌ సౌకర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేంద్రం నిర్ణయంతో యాసంగి పంట సీజన్‌లో వరి కొనుగోళ్లు జరగడం లేదు. వరి సేకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించేంత వరకు టీఆర్‌ఎస్ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎం కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచెర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్ భాస్కర్ రావు తదితరులు హాజరయ్యారు.









Next Story