పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్లు పంచి నిరసన తెలిపారు. శుక్రవారం ప్రార్థనలకు ముందు శాస్త్రిపురంలోని మసీదు వద్ద ఎంపీ అసదుద్దీన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారికి అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నల్ల బ్యాడ్జీలను పంపిణీ చేశారు.
కాగా మక్కా మసీదులో ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చార్మినార్, మక్కామసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను కూడా చేతికి నల్ల బ్యాడ్జీ ధరించారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన అక్కడి వారికి పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన వైఖరిని తాను సమర్థిస్తున్నట్లు ఒవైసీ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో పాకిస్థాన్కు నీటి సరఫరా నిలిపివేయాలనే వాదనలపై ఆయన స్పందిస్తూ, ఒకవేళ నీటిని నిలిపివేస్తే, ఆ నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.