మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
ఇక ఈరోజు టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించేసినట్లయింది. ప్రస్తుతం మునుగోడులో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. పోలీసుల చెకింగ్ కూడా భారీగా సాగుతోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని గూడాపూర్ చెక్పోస్టు వద్ద వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.13 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా గూడాపూర్లో ప్రత్యేక చెక్పోస్టును పోలీసులు ఏర్పాటు చేశారు.