'మల్లన్నా జాగ్రత్త'.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు
By Medi Samrat
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలపై పరుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసన మండలిలోని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని మండలి ఛైర్మన్ను కోరిన కవిత.. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ద్వారా బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం.. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదు అన్నారు.
తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు.. ఇంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా.? ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా.? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుందన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి.. మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారని తెలిపారు.
తీన్మార్ మల్లన్న జాగ్రత్త అంటూ హెచ్చరించిన ఆమె... వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటలు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం.. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ.? అని ప్రశ్నించారు. సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్న.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు.. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు.. నన్నెందుకు అడ్డుకుంటానని అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.