జై తెలంగాణ అనని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు

తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వ‌హించారు.

By Medi Samrat
Published on : 31 May 2025 7:25 PM IST

జై తెలంగాణ అనని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు

తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశార‌ని.. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ.. కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదన్నారు. తెలంగాణ గ్రహచారం బాగలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు.

రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం.. అమరులు శ్రీకాంత చారి లేదా యాది రెడ్డి లేదా కాళోజి లేదా పీవీ నరసింహా రావు పేరు పెట్టాల‌ని సూచించారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడని పరిస్థితి ఏర్పడింది.. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా.. సీఎం కనీసం స్పందించడం లేదు.. ఎందుకు సీఎం అంత బలహీనంగా ఉన్నారు.. పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారు సీఎం.? అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తొపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడుతామని చెప్పింది. పోలవరం నుంచి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోంది. గోదావరి నీళ్లు తెలంగాణకు శాశ్వతంగా దూరంకానున్నాయి.. జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా.? కోటి ఎకరాల మాగాణం చేసిందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా.? రైతులకు రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా ? అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా ? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఇవాళ ప్రతీ తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారు.. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే.. యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు అన్నారు. కేసీఆర్ పిడికిలెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చింది.. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం దారుణం.. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టబోతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహా ధర్నా చేపడుతామ‌ని తెలిపారు.

తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నది. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని బీజేపీని హెచ్చరించారు. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేడుతామ‌న్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి పోరాటం చేస్తుంది. మహిళలకు రూ 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు పోరాటం చేస్తామ‌న్నారు. మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుంద‌న్నారు.

తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి.. జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావొస్తుంది. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తిందన్నారు. తెలంగాణ జాగృతి కేసీఆర్, జయశంకర్ సార్ స్పూర్తితో జాగృతి సంస్థ పుట్టిందని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక అంశాలపై పనిచేయాలని జయశంకర్ సార్ దిశానిర్దేశం చేశారని.. గతంలో అశోక్ నగర్ లో కార్యాలయం ఉండేది.. ఇప్పుడు బంజారా హిల్స్ కు మార్చామని తెలిపారు. సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లిన వారికి ఉద్యమాభివందనాలు తెలిపారు.

Next Story