కేసీఆర్ ఏం తప్పు చేశారు: ఎమ్మెల్సీ కవిత
రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By అంజి
కేసీఆర్ ఏం తప్పు చేశారు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేసీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని రాజకీయంగా ప్రేరేపితమని కవిత అభివర్ణించారు. నిరసనగా ఆమె ఇందిరాపార్క్ వద్ద మహా-ధర్నాను ప్రారంభించారు. ఈ నిరసనలో జాగృతి నాయకులు, కార్యకర్తలు కూడా చేరారు.
హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఏం తప్పు చేశారు? నీళ్లు , నిధులు ఇవ్వడం ఆయన చేసిన తప్పా? తెలంగాణను అభివృద్ధిలో నంబర్ 1 గా నిలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే.. మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టేనన్నారు. కాళేశ్వరం మీద వేసింది జ్యుడిషియల్ కమిషన్ కాదని.. కాళేశ్వరం కమిషన్ అనేది కాంగ్రెస్ కమిషన్ కవిత దుయ్యబట్టారు. కాళేశ్వరం పూర్తి అయితే 35 శాతం భూభాగానికి నీళ్లు అందుతాయి. రైతులకు నీటి కష్టం ఉండొద్దని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ ప్రాజెక్టు కట్టారని కవిత వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదని.. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌస్లు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరమని.. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరమని.. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి.. ఎత్తిపోసే ప్రాజెక్టు కేసీఆర్దేనన్నారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేసిందని విమర్శించారు.