రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్..ఆ ప్రశ్నతోనే విజేత ఎవరనేది డిసైడ్
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ దశకు చేరుకున్నాయి
By Knakam Karthik
రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్..ఆ ప్రశ్నతోనే విజేత ఎవరనేది డిసైడ్
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ దశకు చేరుకున్నాయి. దీంతో మిస్ వరల్డ్ కిరీటం ఏ దేశ భామను వరిస్తుందోననే ఆసక్తి నెలకొంది. హైటెక్స్ వేదికగా శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఫైనల్స్ జరగనున్నాయి. హైటెక్స్లో జరిగే ఈ వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మందే తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తరువాతి నుంచే ఫైనల్స్ ప్రారంభమవుతాయి.
సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్లో ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురిని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్-కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరాడెల్గాడోబ్, ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ప్రిన్సెస్సీ, యూరోప్ నుంచి మోంటెనెగ్రో భామ ఆండ్రియా నికోలిక్, ఆసియా-ఓషియానా నుంచి థాయ్లాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ నలుగురు మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్(టాప్40) జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ట్రాక్లో ఇప్పటివరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు.
ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రధానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది, కొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్లో ప్రసారం అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్లో అందుబాటులో ఉంటుంది.
టాప్ 40 నుంచి తదుపరి రౌండుకు 20 మందిని, ఆ తర్వాత వారిలో 8 మందిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరేసి ఉంటారు. మహిళల సమకాలిక సమస్యలు, ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు పోటీదారుల్లో ఎవరు ఉత్తమంగా సమాధానం ఇచ్చారనేది అక్కడ ఉండే న్యాయనిర్ణేతలు నిర్ణయిస్తారు. అలా ఎనిమిది మందిలో నుంచి నలుగురిని ఎంపిక చేస్తారు. ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తారు? అనే ఆఖరి ప్రశ్న అడుగుతారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ప్రపంచ సుందరి ఎవరనేది నిర్ణయమవుతుంది. విజేతకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా అందాల కిరీటాన్ని ధరింపజేయడంతో వేడుక ముగుస్తుంది