'HT పత్తి విత్తనాలను కొనొద్దు'.. రైతులను అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల
HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
By - అంజి |
'HT పత్తి విత్తనాలను కొనొద్దు'.. రైతులను అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్లో ఫెయిలైనందున కేంద్రం ఆ కంపెనీ విత్తనాల అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు HT పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కో మార్కెటింగ్కు విధి విధానాలు రూపొందించాలన్నారు.
రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చిన నకిలీ పత్తి విత్తనాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో, వ్యవసాయ మంత్రి తుమ్మల.. అనుమతి లేని HT (హెర్బిసైడ్ టాలరెంట్ / BG-III) పత్తి విత్తనాల ప్రవేశం, అమ్మకాలను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్ నుండి HT, నకిలీ పత్తి విత్తనాల అక్రమ తరలింపును ఆపడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని మరియు సరిహద్దు ప్రాంతాలలో నిఘాను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు.
మోన్శాంటో అభివృద్ధి చేసిన HT పత్తి క్షేత్ర పరీక్షలలో వైఫల్యం, పర్యావరణ సమస్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని మంత్రి వివరించారు. పత్తి విత్తనాల సహ-మార్కెటింగ్పై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని, పెద్ద ఎత్తున రైతు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ గోపి, శాఖాపరమైన అధికారులు, విత్తన కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.