'దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ'

Minister Srinivas Goud Inaugurates Paddy Procurement Centre In Mahabubnagar. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్‌ పని చేస్తోందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

By అంజి  Published on  13 Nov 2022 1:05 PM GMT
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ

రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్‌ పని చేస్తోందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి ఫెసిలిటీలు కల్పించలేదన్నారు.

ఉమ్మడి ఏపీలో విద్యుత్ కోసం ధర్నా చేస్తే కాల్చి చంపిన సంఘటనలు మరిచిపోలేదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత సాగునీరు, ఫ్రీ కరెంట్‌, రైతు బంధు, రైతువేదికలు వంటి అన్ని ఫెసిలిటీలు కల్పించి వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. ఈ సౌకర్యాలతో దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు. గతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఎక్కువ పంటలు పండించే రాష్ట్రాలుగా ఉండేవని, ప్రస్తుతం వాటిని తెలంగాణ మించిపోయిందన్నారు. దేశానికి కరువొచ్చినా తెలంగాణ ఆదుకుంటుందని మంత్రి అన్నారు.

దేశానికే అన్నంపెట్టే రైతన్నకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దేశంలో రైతు నిజాయితీపరుడని, రైతులు పుష్కలంగా పంటలు పండిస్తే ప్రజలందరూ బలోపేతం అవుతారని మంత్రి తెలిపారు.

Next Story