దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన హఠార్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిత్యం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. చివరి వరకూ ప్రజల కోసమే పని చేశారు. నా ప్రజలే నా బలం.. బలగం అని తరచూ చెప్పేవారు అని గుర్తు చేసుకున్నారు.
రెండు రోజుల కిందటే గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించాను. అప్పుడు అంతకు ముందు రోజుతో పోలిస్తే ఆరోగ్యం కొంచెం మెరుగయ్యిందని చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరాను. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. మూడు, నాలుగు దశాబ్దాల నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఆయన మా కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు. గొప్ప మానవతావాది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు.
ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు. ఒక సమస్య పరిష్కారం అయ్యే వరకూ విశ్రమించే వారు కాదు. రాజకీయాల్లో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు చేరుకున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు. వరుసగా మూడు సార్లు జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందారంటేనే తెలుస్తుంది.. ప్రజల్లో ఆయనకున్న బలం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు.