విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఇదే అనువైన సమయం

Minister Sabitha Indrareddy About Schools Opening. తెలంగాణలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరుచుకోనున్న విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  28 Aug 2021 2:00 PM GMT
విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఇదే అనువైన సమయం

తెలంగాణలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరుచుకోనున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ఉన్న మహబూబియా బాలికల పాఠశాలను సందర్శించారు. మంత్రి వెంట ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థుల.. ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలో సదుపాయాలు, తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఇదే అనువైన సమయం అని భావిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ పై అన్ని కోణాల్లో ఆలోచించే సీఎం కేసీఆర్ విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

సెప్టెంబరు 1 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు ఈ నెల 26 నుంచే స్కూళ్లకు రావాల్సి ఉంటుందని ఆదేశించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను యుద్ధ పాత్రిపదికన సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని.. ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగాలన్నారు. సీఎం కేసీఆర్‌ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆదేశించారని చెప్పారు.


Next Story