రుణమాఫీ ర‌గ‌డ‌ : నిరూపించకపోతే రాజీనామా చేస్తావా..? కేంద్ర మంత్రికి స్టేట్ మినిస్ట‌ర్ స‌వాల్‌

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని అందులో భాగంగా నిన్నటి వరకు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

By Medi Samrat  Published on  19 July 2024 10:06 AM GMT
రుణమాఫీ ర‌గ‌డ‌ : నిరూపించకపోతే రాజీనామా చేస్తావా..? కేంద్ర మంత్రికి స్టేట్ మినిస్ట‌ర్ స‌వాల్‌

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని అందులో భాగంగా నిన్నటి వరకు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే లక్షా 50 వేల వరకూ, ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని.. అది తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అయితే.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించడం లేదంటున్న బండి సంజయ్ అది నిరూపించకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని డిమాండ్ చేశారు.

రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారతదేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంటుంటే దానిని భరించలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతులకు ఆత్మహత్యలకు కారణమైన మీరు.. ఈరోజు రైతులకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుంటుంటే సమర్థించాల్సింది పోయి.. సమర్థించకపోగా .. విమర్శిస్తున్నారంటే అది మీ కుహనా బుద్ధి అని అర్థం అవుతుందన్నారు.. మీరు కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం తెస్తారో చెప్పండి.. రైతులకు ఏం తెస్తారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు.

రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసిన మీకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.. గుజరాత్ లో భారీ వర్షాలు కురిస్తే వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాలకు పంట నామ రూపలేకుండా పోతే పంట నష్ట పరిహారం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు. తక్షణమే బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 మీ ఎన్నికల మేనిఫెస్టో లో 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు.. ఎంతమందికి ఇచ్చారు.. రైతుల మీద ఫసల్ భీమా. భారాన్ని పెంచారు. ఎరువుల సబ్సిడీలో 75 వేల కోట్లు కోత పెట్టారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలను రెట్టింపు చేశారు. అగ్రికల్చర్ సెస్ పేరుతో పంట ఖర్చులు పెంచారు. బండి సంజయ్ వ్యవహార శైలి చూస్తుంటే గురివింద గింజ నలుపెరుగదు అనే సామెతను గుర్తు చేస్తుంది. రైతులకు జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశంసించే ప్రయత్నం చేయండి.. అంతే తప్ప రైతులకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమాన్ని విమర్శించే ప్రయత్నం చేయవద్దని అన్నారు.

Next Story