కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే గ్యాస్ కొరత : మంత్రి పొన్నం ప్రభాకర్
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది.
By - Medi Samrat |
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో వంట కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకుండినట్లు వ్యవహరిస్తుంది. రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు.ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు.. రాష్ట్రానికి సరిపడ గ్యాస్ తీసుకురాలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. గతంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని ఆపమని చెప్పిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడెందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. గ్యాస్ ఇప్పటికిప్పుడు కొరత లేకున్న వంట గ్యాస్ కి సంబంధించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నుండి నిర్దిష్ట ప్రకటన ఎందుకు రావడం లేదు. గ్యాస్ కొరత లేనప్పుడు గ్యాస్ ధరలు ఎందుకు పెంచారో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమాధానాలు చెప్పడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గ్యాస్ తో పాటు భవిష్యత్తులో ఎరువుల కొరత సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాలి గ్యాస్ కొరత నివారించాలి. ఎరువుల కొరత రాకుండా చూసుకోవాలన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే కేంద్రం రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాల వల్ల రవాణా రంగం, చిన్న వ్యాపారాలు మరియు గృహ వినియోగదారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.రాష్ట్రానికి అవసరమైన గ్యాస్ సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి డిమాండ్ చేశారు. రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ పంపిణీపై స్పష్టమైన విధానాలు తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం సహకరిస్తే సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు..