ఇళ్ల పథకానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తున్నామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. పేదవారి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ప్రేమ అభిమానాలు ఉన్నాయన్నారు. నిన్న ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యం అని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా సన్నబియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. పది సంవత్సరాల్లో మాజీ సీఎం కేసీఆర్కి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 19 లక్షల మంది పేర్లను కొత్తగా రేషన్ కార్డులో చేర్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.