వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా?: మంత్రి నిరంజన్‌రెడ్డి

Minister niranjanreddy fires on BJP And Congress. భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌ హౌస్‌లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మంత్రి నిరంజన్‌

By అంజి  Published on  24 July 2022 9:59 AM GMT
వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా?: మంత్రి నిరంజన్‌రెడ్డి

భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌ హౌస్‌లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో చాలా సార్లు భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు ఇంజినీర్‌ పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరడ్డుకున్నా ఏడాదిన్నరలోగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో కృష్ణా నదిపై మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయని నిరంజన్​రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నెహ్రూ, శ్రీశైలం ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వైఎస్సార్‌ కట్టారంటారు. కానీ కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్‌ గురించి మాత్రం ఎందుకు మాట్లాడరని అన్నారు. నీటి లభ్యత ఉన్న చోట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్నారు. సాంకేతికంగా ఏ లోపం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని, వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

''1998, 2009 లో శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా? ప్రాజెక్టు ఇంజినీర్ పెంటారెడ్డిని అవమానిస్తారా. కాంగ్రెస్ హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా?'' అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు 180పైగా కేసులు వేశారన్నారు.

Next Story