నల్లధనం ఏమైందని అడిగితే తెల్లమొఖం వేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు: మంత్రి కేటీఆర్

Minister KTR Fire On BJP. తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  28 Feb 2023 3:30 PM GMT
నల్లధనం ఏమైందని అడిగితే తెల్లమొఖం వేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారు: మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నించే వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నారని.. ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని చెప్పారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారని.. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం ముమ్మాటికి బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ మతం, కులం పేరుతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నల్లధనం ఏమైందని అడిగితే తెల్లమొఖం వేసుకుని తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, మన రాష్ట్రంలో మన నిధులు మనకు వస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ రోజైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దేవాదుల ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.

అంతకు ముందు ప్రీతి ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. ప్రీతి ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మంత్రి తేల్చిచెప్పారు. అది సైజ్‌ కానీ, సంజయ్‌ కానీ ఎవరైనా వదిలి పెట్టేది లేదన్నారు. ప్రీతి ఘటనను కొందరు కావాలనే రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


Next Story