తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రి హరీష్రావుకు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. సచివాలయంలో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం అయ్యాయి. తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ టూరిజంను ప్రపంచానికి పరిచయం చేశాం. అంతర్జాతీయ పోటీలను చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం చేయగలదని నిరూపించాం. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ఒలింపిక్స్ కూడా జరపగలం అని నిరూపించాం..అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
ఇక మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సి పోయి విమర్శలు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చయింది రూ.31 కోట్లు. స్పాన్సర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయి. మరో రూ.12 కోట్లు కమిట్మెంట్ ఉన్నాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.10 కోట్లు మాత్రమే. విపక్షాల విమర్శలు చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఒక్కో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు 30 తులాలు కాదు.. మూడు గ్రాములు సైతం కూడా ఇవ్వలేదు. హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణ భవన్కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలా? రూ.200 కోట్లు ఎక్కడ ఖర్చు అయ్యాయో చెప్పాలి. ఖర్చు అయినట్లు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలి..అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు.