హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లిన ఆయన.. ఓపీలో ఉన్న రోగులతో మాట్లాడారు. చికిత్స, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వైపు వైద్యుల హాజరు పట్టికను తెప్పించుకుని మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. అందులో భాగంగా ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
మరోవైపు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి దామోదర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని మంత్రి ఆదేశించారు. అదే క్రమంలో ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై మంత్రి సీరియస్ అయ్యారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈకి ఆదేశాలు ఇచ్చారు.