మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తాం
చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By - Medi Samrat |
చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడారంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అన్నారు. గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇది.. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు.. దక్షిణాది కుంభమేళా మేడారం జాతర అని పేర్కొన్నారు.
ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ప్రజాకంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించా.. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వంద రోజుల్లో రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించా.. జాతర నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేశాం.. ఇది నాకు అరుదైన అవకాశం.. జీవితంలో ఏం చేశామని వెనక్కితిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గర్వంగా చెప్పుకుంటానన్నారు. మేడారం అభివృద్ధి చేసి ఫిబ్రవరి 6, 2023న మొక్కుకున్న మొక్కు తీర్చుకున్నామన్నారు. మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు పారిస్తామన్నారు. రామప్ప, లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీరు తరలిస్తామన్నారు. రేపు ఉదయం సమ్మక్క- సారక్క ఆలయాన్ని ప్రారంభించుకుని భక్తులకు అంకితం చేస్తామని తెలిపారు. మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామన్నారు.