మేడారం మాస్టర్ ప్లాన్ రెడీ..సీఎం ఆమోదం తర్వాతే పనులు

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

By -  Knakam Karthik
Published on : 19 Sept 2025 10:51 AM IST

Telangana, Mulugu District, Medaram Jaathara, Sammakka Saralamma, Tribal Festival, Master Plan

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం అయ్యిందని వరంగల్ ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతరను పురస్కరించుకుని సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మేడారం జాతరపై మాస్టర్ ప్లాన్‌పై సమీక్షించారు. జాతరకు సంబంధించి సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటివి ఎలాంటి లోటు పాట్లు లేకుండా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు.

ఆలయ ప్రధాన ద్వారం డిజైన్, సరిహద్దు గోడ నిర్మాణానికి అవసరమైన రాయి డిజైన్, ఆలయ అభివృద్ధి తర్వాత అదనంగా జోడించబడే ప్రాంతంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన కన్సల్టెన్సీని రెండు రోజుల్లోగా అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించారు. కన్సల్టెన్సీ అధికారులు మరియు ప్రతినిధులు స్వయంగా మేడారం సందర్శించి అక్కడి పూజారులు మరియు స్థానిక ప్రజలందరి అభిప్రాయాలను తీసుకొని ఆలయ రూపకల్పనను సిద్ధం చేశారని మంత్రి చెప్పారు. గతంలో, క్యూల కారణంగా భక్తులు పగిద్ద రాజా మరియు గోవింద రాజులను సరిగ్గా దర్శనం చేసుకోలేకపోయారు. మహా జాతర సమయంలో భక్తులకు ఇది ఒక సమస్యగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి, "భక్తుల సౌలభ్యం కోసం మేము పుణ్యక్షేత్రాల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నాము" అని వారు చెప్పారు.

Next Story