తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు పోరాడామని, వర్గీకరణలో తమకు రావాల్సిన వాటా కంటే 2 శాతం తక్కువ రిజర్వేషన్లు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రిజర్వేషన్ల పంపిణీలోని లోపాలను సవరించి ముందుకెళ్లాలని కోరారు.
మాదిగల జనాభాకు తగినట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని ఏ ప్రాతిపదికన తీసుకున్నా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలని అన్నారు. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన దానిలో తమకు 9 శాతమే దక్కుతున్నదని అన్నారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11 శాతం రావాలని చెప్పారు. ఈ నెల 7వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు, వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంద కృష్ణ ప్రకటించారు. ఆ కార్యక్రమం స్థానంలో సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు.