ఐదేళ్ల మిత్తి మాత్ర‌మే మాఫీ అయ్యింది : మధు యాష్కీ

Madhu Yashki in Executive Meeting of TPCC Campaign Committee. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అధ్యక్ష‌త‌న శుక్ర‌వారం గాంధీ భవన్‌లో ప్రచార కమిటీ

By Medi Samrat  Published on  4 Aug 2023 3:02 PM GMT
ఐదేళ్ల మిత్తి మాత్ర‌మే మాఫీ అయ్యింది : మధు యాష్కీ

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అధ్యక్ష‌త‌న శుక్ర‌వారం గాంధీ భవన్‌లో ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. స‌మావేశం అనంత‌రం మధు యాష్కీ మాట్లాడుతూ.. ఈనెల 6న గాంధీ ఐడియాలోజి సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీల‌ తోడు దొంగల సినిమాను చూపిస్తామ‌న్నారు. కేసీఆర్, మోదీ తెరవెనుక తెరముందు ఎట్లా అనేది చూపిస్తాం అని వెల్ల‌డించారు. రుణమాఫీని ఐదేళ్లుగా మాఫీ చేయకుండా ఇప్పుడు చేస్తామని ప్రకటించారు. ఐదేళ్ల మిత్తి మాఫీ అయ్యిందని అన్నారు. దీనిపై పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామ‌ని పేర్కొన్నారు. తెలంగాణాలో దోపిడీ జరుగుతోంది.. అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నారని అన్నారు. రేపు రాష్ట్రానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారని.. పార్లమెంట్ అడ్వైజరీ సభ్యులు కూడా వస్తారని వెల్ల‌డించారు.

సత్యమేవ జయతే.. రాహుల్ విషయంలో సత్యం గెలిచిందని అన్నారు. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరం.. రాహుల్ గాంధీని అణిచివేయాలని చూశారని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా కుట్రలు చేసి కాదు అని సూచించారు. కేంద్ర విచారణ సంస్థలను ఉసిగొల్పి కాంగ్రెస్ నేతలను, సానుభూతి పరులను వేధిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడం లేదని ప్ర‌శ్నించారు.

పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎన్నికల హామీలను జనాల్లోకి తీసుకెళతామ‌న్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వారిని ఏవిధంగా కాపాడుకోవాలని అనేదానిపై చర్చ చేశామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ సానుభూతి పరులను కూడా కాపాడుకుంటామ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామ‌న్నారు.

Next Story