దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. లచ్చిగూడెంకు చెందిన నిందితులు సోందే ముద్ద రాజు, సొందే రవిలకు మృతుడు కారం రామకృష్ణతో ఉన్న భూవివాద నేపథ్యంలో మరొక ఐదుగురు నిందితులతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. తేదీ 10.02.2020 రాత్రి సమయంలో కారం రామకృష్ణ తన ఇంట్లో భార్య పిల్లలతో నిద్రిస్తుండగా కత్తులు, కర్రలతో వెళ్లి హత్య చేసి అడ్డు వెళ్లిన భార్యను తీవ్రంగా గాయపరిచారు.
మొత్తం 08 మంది నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదవగా.. విచారణ సమయంలో ఇద్దరు నిందితులు మరణించగా ఒకరిని నిర్దోషిగా విడుదల చేశారు. మిగిలిన ఐదుగురు ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. తీర్పు అనంతరం జిల్లా జడ్జి ఉత్తర్వుల మేరకు నిందితులను దుమ్ముగూడెం పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.
ఈ కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన విచారణ అధికారి ఇన్స్పెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాధా కృష్ణ, పీవిడి లక్ష్మీ, నోడల్ ఆఫీసర్ ఎస్సై ప్రవీణ్, లైజన్ ఆఫీసర్ వీరబాబు, దుమ్ముగూడెం కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ తిరుపతిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.