హైదరాబాద్: నిన్న జరిగిన దాడిలో గాయపడిన చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ను మాజీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన వారు రాజన్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఇప్పటికే కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
రంగరాజన్పై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఖండించారు. ఇటీవల జరిగిన దాడి అనంతరం కేటీఆర్ తన పార్టీ నేతలతో కలిసి రంగరాజన్ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించొద్దని అన్నారు. దైవ సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబీకులే ఈ పరిస్ధితిలో ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చూడొచ్చని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ఈ నేరానికి పాల్పడిన వారిని చట్టపరంగా, కఠినంగా విచారించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.