కొద్దిపాటి పోస్టులను కూడా భర్తీ చేయలేరా.? పేపర్ లీకేజ్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

Komatireddy Venkat Reddy Slams Telangana Govt. భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లాలో రాహుల్ గాంధీ అనర్హత, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, రైతులకు నష్టపరిహారం

By Medi Samrat  Published on  29 March 2023 1:15 PM GMT
కొద్దిపాటి పోస్టులను కూడా భర్తీ చేయలేరా.? పేపర్ లీకేజ్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

Komatireddy Venkat Reddy

భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లాలో రాహుల్ గాంధీ అనర్హత, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, రైతులకు నష్టపరిహారం అంశాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. 2019 ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఫ్లోలో మాట్లాడిన మాటలేన‌ని.. ఎవరినీ ఉద్దేశించి అనలేదని స్ప‌ష్టం చేశారు. ప్రచార సభలలో దేశంలో జరుగుతున్న సంఘటనలను ఉదాహరణగా చెప్పారు. దీనిపై కిందిస్థాయి కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. వెంటనే బెయిల్ ఇచ్చి పైకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చింది. గతంలో ఎంతో మందికి కింది కోర్టులో శిక్ష పడితే.. పైకోర్టుల్లో స్టే తెచ్చుకున్నారు. కోర్టు సమయం ఇచ్చినా లోక్ సభ సచివాలయం తొందరపడింది. నెల ఆగితే పోయేదేముంది.. 24 గంటల లోపే అనర్హత వేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

రాహుల్.. దేశం కోసం తండ్రిని, నాయనమ్మను కోల్పోయారని అన్నారు. దేశం ఐక్యత కోసం కష్టపడుతున్న వ్యక్తి.. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి.. నాలుగోసారి ఎంపీగా ఉన్న వ్యక్తిని డిస్ క్వాలిఫై చేయడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం.. న్యాయ పోరాటం చేస్తామ‌ని తెలిపారు. ఏప్రిల్ చివరి వరకు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.. ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. నేను కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.. కానీ, భువనిగిరిలో కార్యక్రమాల వల్ల వెళ్లలేదని వెల్ల‌డించారు. ప్రజలందరు రాహుల్ పై అనర్హతను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలియజేయాలన్నారు. అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ తో నిరుద్యోగులకు అన్యాయం చేశారని ప్ర‌భుత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. 9 ఏళ్లుగా 70 వేల టీచర్ల పోస్టులు ఖాళీ అయితే డిఎస్సీ నోటిఫికేషన్ లేదు. ఇది చరిత్రలో తొలిసారి అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతీ రెండేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్లం. 10 వేల పోస్టులు ఖాళీ అవ్వగానే ఇచ్చామ‌ని వివ‌రించారు. డీఎస్సీకి సంబంధించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. గ్రూప్స్ పోస్టులకు ఇవ్వకఇవ్వక నోటిఫికేషన్లు ఇచ్చారు. గతంలో ఇంటర్ పరీక్షల స్కాంకు పాల్పడ్డ గ్లోబరేనా సంస్థకే గ్రూప్స్ పరీక్షలు అప్పజెప్పారు. ఈ సంస్థ వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఈ రోజు అలాంటి సంస్థకే అంతా అప్పజెప్పి 30 లక్షల మంది పిల్లల భవిష్యత్ ను నాశనం చేశారని మండిప‌డ్డారు. కనీసం పేపర్లు దిద్దడం రాదు ఈ ప్రభుత్వానికి.. ఖాళీ పోస్టులు భర్తీ చేయడం రాదు.. 6వేల స్కూళ్లు మూతబడ్డాయి.. యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీని భర్తీ చేయడం రాదు అని విమ‌ర్శ‌లు గుప్పించారు. పేపర్ లీకేజ్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలి.. దీనిపై హోమంత్రిని కలవబోతున్నామ‌ని తెలిపారు. టీఎస్సీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డికి ఆఫీసర్ గా మంచి పేరున్నా.. ఇప్పుడు ఆ పరువంతా పోయింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసి.. జరిగింది జరిగినట్టు బయటపెట్టాలి. కొద్దిపాటి పోస్టులను కూడా భర్తీ చేయలేరా? అని ప్ర‌శ్నించారు.

వడగళ్ల వానకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నాశనం అయిన పంటలను పరిశీలించి దీక్షలు చేశాం. ఆ తర్వాత సీఎం ఎకరానికి 10వేలు ప్రకటించారు. అది ఏం సరిపోతుందని వెంక‌ట్ రెడ్డి ప్ర‌శ్నించారు. 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడిస్తున్నారు.. 6 గంటలు కూడా రావడం లేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బా కొట్టుకున్నారు. భువనగిరి చుట్టుపక్కల 6, 7 గంటలకు మించి వస్తుందా? అని ప్ర‌శ్నించారు. రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేదని విమ‌ర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అందుకే, అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు.. ఉద్యోగం చేసే భర్యాభర్తలు వేర్వేరు చోట్ల ఉంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని విచారం వ్య‌క్తం చేశారు. మాణిక్ రావు థాక్రే నేతృత్వంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. టికెట్ల విషయంలో సర్వే చేయించి ఇస్తారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అంశంతో పాటు ఇతర ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తూనే ఉంటామ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పేర్కొన్నారు.


Next Story