ఒప్పందం ప్రకారం ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేస్తుంది

Kishan Reddy finds fault with Ministers for criticizing Centre on paddy procurement. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి గింజను కేంద్రమే

By Medi Samrat
Published on : 25 March 2022 3:00 PM

ఒప్పందం ప్రకారం ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేస్తుంది

ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో త్వరలో నిర్వహించనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాల గురించి వివరించేందుకు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. వరి సేకరణ విషయంలో తెలంగాణకు చెందిన మంత్రులు.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

మంత్రులు రోజుకో అబద్ధం మాట్లాడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ రాష్ట్రంలోనూ సమస్య లేనప్పుడు తెలంగాణలో ఎందుకు సమస్య వచ్చిందో చెప్పాలన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, కె రోశయ్య హయాంలో కూడా ఎలాంటి సమస్య లేదని అన్నారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కూడా కొనుగోళ్లలో సమస్యను ఎదుర్కొన‌డం లేద‌ని.. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత తెలంగాణలో సమస్య మొదలైందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

2014-15లో తెలంగాణలో వరి కొనుగోలు కోసం యూపీఏ ప్రభుత్వం రూ.3,404 కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గతేడాది రూ.26,641 కోట్లు ఖర్చు చేసింది. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇదే అన్నారు. వరి సేకరణ విషయంలో కేంద్రాన్ని నిందించడం, రైతులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఉద్దేశమని ఆరోపించారు.

రాష్ట్రాల నుంచి వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ఒకేర‌క‌మైన‌ విధానాన్ని అవలంబిస్తున్నదని, వరి కొనుగోలుకు అయ్యే ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇంధన ధరల పెంపునకు నిరసనగా అధికార పార్టీ నేతలు ధర్నాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మహమ్మారి సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై పన్నులను తగ్గించాయి. కానీ తెలంగాణలో ప్రభుత్వం పన్ను తగ్గించలేదని గుర్తుచేశారు.
















Next Story