12 శాతం రిజర్వేషన్లపై కేసీఆర్ ముస్లింలను మోసం చేశారు: రేవంత్ రెడ్డి

KCR cheated Muslims on 12 pc reservations.. Revanth Reddy. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్ జోడో యాత్ర'లో భాగంగా

By అంజి  Published on  29 Jan 2023 5:25 AM GMT
12 శాతం రిజర్వేషన్లపై కేసీఆర్ ముస్లింలను మోసం చేశారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్ జోడో యాత్ర'లో భాగంగా.. రెండో రోజు వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు దౌల్తాబాద్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించి ప్రజలతో మమేకమయ్యారు. దౌల్తాబాద్ మండలానికి చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో ప్రచారంపై సమీక్షించారు. బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను తప్పుడు కేసుల ద్వారా వేధిస్తున్నదన్నారు. రిజర్వేషన్ల పేరుతో ముస్లింలు, గిరిజన వర్గాలను మోసం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే ఈ విషయంలో సీరియస్‌గా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు దేశంలో విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, విద్వేషాలను అంతం చేసేందుకు కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు.

కొడంగల్‌లో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులు నేటికీ అలాగే ఉన్నాయని అన్నారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం కొడంగల్‌ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బి-ఫారమ్‌లపై సంతకం చేసేందుకు సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రహస్య అవగాహన కుదిరిందని రేవంత్‌ అన్నారు. 2024 జనవరి 1 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వ అన్యాయాలపై కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు.

Next Story