హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం. సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ ఎం. జగన్నాథరావు కుమారుడే జస్టిస్ రామచంద్రరావు.
రామచంద్రరావు స్వస్థలం హైదరాబాద్. ఉస్మానియా యూనివర్సిటీలో 1989లో ఎల్ఎల్బీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్యను అభ్యసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాదిగా సివిల్, కంపెనీ, పరిపాలన, ఆర్బిట్రేషన్ కేసులను వాదించారు. ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012 జూన్ 29న నియమితులయ్యారు. 2013 డిసెంబర్ 4 నుంచి న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.