కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం

JP Nadda Fire On CM KCR. 3వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ముగింపు సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  27 Aug 2022 1:01 PM GMT
కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం

3వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ముగింపు సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టడం నా అదృష్టం గా భావిస్తున్నాన‌ని అన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. 3వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ముగింపు సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చిందని.. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. కేసీఆర్ అంధకారంలోకి నెట్టేసిన తెలంగాణలో వెలుగులు నింపడ‌మేన‌ని అన్నారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వం.. ఈ కేసీఆర్ ప్రభుత్వం. నేను 2వ విడత పాదయాత్ర కు వచ్చినప్పుడు కూడా.. ఆ సమయంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని.. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం అని అన్నారు. ప్రజలు బీజేపీ కి మద్దతు ఇవ్వడం ఖాయం. అప్పట్లో నిజాం జన సభలు పెట్టుకోవద్దని చివరి ఫర్మాణా జారీ చేశాడు.. అదే ఆయనకు చివరిది అయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా సభలు పెట్టుకోవద్దని ఫర్మాణాలు జారీ చేస్తున్నాడు. కేసీఆర్ కు కూడా ఇదే చివరి ఫర్మాణా అవుతుందని అన్నారు.

తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేసినా.. కేసీఆర్ వాటిని ఖర్చు చేయలేదని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతో.. తన బొమ్మ పెట్టుకుని, తన స్కీమ్స్ గా ప్రచారం చేసుకుంటున్నాడని విమ‌ర్శించారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని కాకినాడ లో మొదట తీర్మానం చేసిందే బీజేపీ అని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం లా మారిందని అన్నారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు ను 1.40వేల కోట్లకు పెంచుకుని, డబ్బు దండుకున్నాడని ఆరోపించారు. మజ్లిస్ కు భయపడే.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని విమ‌ర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. 'తెలంగాణ విమోచన దినోత్సవం' ను అధికారికంగా జరుపుతామ‌ని అన్నారు.

బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడని.. దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించాం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు చూపిస్తాం. కేసీఆర్ అవినీతి, తానాసాహి పాలనను బొందపెడతాం అని అన్నారు.


Next Story