తెలంగాణ రాష్ట్ర ప్ర‌క‌ట‌నే కాదు.. అభివృద్ధి బాధ్యత కూడా కాంగ్రెస్‌దే : జైరాం రమేష్

నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణ‌యించ‌బ‌డుతుంద‌ని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు

By Medi Samrat  Published on  27 Nov 2023 9:53 AM GMT
తెలంగాణ రాష్ట్ర ప్ర‌క‌ట‌నే కాదు.. అభివృద్ధి బాధ్యత కూడా కాంగ్రెస్‌దే : జైరాం రమేష్

నవంబర్ 30న జరుగునున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణ‌యించ‌బ‌డుతుంద‌ని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. 9 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. కేవలం ప్రకటించడమే మాత్రమే కాదు.. తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాదును రాజధానిగా ఏర్పాటు చేశాం.. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామని పుకార్లు వచ్చినప్పటికీ ఏకైక రాజధాని ప్రకటించామ‌న్నారు.

9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలయిందన్నారు. తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ మాయమాటలను చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలోకి నెట్టేసిందన్నారు. తెలంగాణలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంలను ప్రకటించిందని తెలిపారు. 6 గ్యారంటీ స్కిమ్‌లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ రూపొందించడం జరిగిందని వివ‌రించారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి పథకాన్ని ఇప్పటివరకు అమలు చేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్ ల తోపాటు మేనిఫెస్టోను సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులను కట్టడి చేస్తే.. ఆరు గ్యారంటీ స్క్రీమ్‌ లతో పాటు మరిన్ని స్కీములను ప్రజలకు అందించే వెసులుబాటు ఉందని అన్నారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చిన కేసీఆర్ దేశంలోనే పర్ క్యాప్ట ఆదాయంలో నెంబర్ వన్ అని మాయమాటలు చెబుతున్నారు. దేశంలో ఫర్ క్యాప్ట ఆదాయంలో హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే హామీలను ఇస్తూ రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు సంసిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ మాయమాటలకు కాలం చెల్లిపోయిందన్నారు.

Next Story