ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. పదవికి రాజీనామా చేస్తా

Jaggareddy Key Comments On MLC Election Result. రెండు నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ వరి ధాన్యంపై జగడం చేస్తున్నాయని ఎమ్మెల్యే,

By Medi Samrat  Published on  29 Nov 2021 11:25 AM GMT
ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. పదవికి రాజీనామా చేస్తా

రెండు నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ వరి ధాన్యంపై జగడం చేస్తున్నాయని ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. రోడ్ల మీద గుట్టలు గుట్టలుగా ధాన్యం ఉందని అన్నారు. మెదక్ మార్కెట్ కి వెళ్లి చూస్తే 20 లారీల వడ్లు ఉన్నాయని.. రైతులు అంతా.. మార్కెట్ యార్డులో ఎదురు చూడాల్సి వస్తుందని అన్నారు. పంట పండించడానికి.. మార్కెట్ కి వచ్చి కోనేదాకా రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. టీఆర్ఎస్‌ నాయకులు వాళ్లకు దగ్గరగా ఉండే రైతుల ధాన్యం కొనుగోలు, రవాణా చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేకి దగ్గరి వ్య‌క్తుల‌ వడ్లే కొంటున్నారని.. సాధారణ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఫైర్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడిన.. 20 లారీల ధాన్యం కొన్నారు.. సంతోషం.. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు రోడ్ల మీదనే ఉన్నాయని అన్నారు. సీఎం జోక్యం చేసుకుని.. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లి వడ్లు కొనేల చేయాల‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. తడిసిన వడ్లు కూడా తౌడులా మారిపోయాయని.. కలెక్టర్లను మార్కెట్లకు వెళ్లి ధాన్యం కొనేలా చేయండని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం మాట్లాడటం లేదని.. మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాలో మాట్లాడటం మానేసి వడ్లు కొనే పని చేస్తే బెటర్ అని సూచించారు. అన్నీ విషయాలు సీఎంకి తెలియక పోవచ్చని.. సీఎం వెంటనే అధికారులను మార్కెట్ యార్డుకు పంపాల‌ని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను కాబట్టే తాను వ‌రి దీక్షకు రాలేదని.. మేము ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోటీలో ఉన్నాం కాబట్టే స్థానిక ప్రజా ప్రతినిధుల‌కు విలువ వచ్చిందని.. 230 ఓట్ల‌ కంటే.. ఒక్క ఓటు తక్కువ వచ్చినా.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామ చేస్తాన‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. అందరినీ ఒప్పించి అభ్యర్దిని పోటీలో నిలిపాను కాబట్టి నేనే బాధ్యత వహించి.. ఎమ్మెల్యే పదవికి పరిమితం అవుతాన‌ని అన్నారు. రైతు ఆకలితో ఉంటే.. బీజేపీ, టీఆర్ఎస్‌ రాజకీయ ఆటలు ఆడుతూ.. రైతు కష్టాల మీద రాజకీయ యుద్ధం చేస్తున్నారని విమ‌ర్శించారు. పరిష్కారం చేయాల్సిన వాళ్ళు దీక్షల్లో కూర్చుంటే ఏం లాభం.. కాంగ్రెస్ దీక్ష చేస్తే అర్థం ఉందని.. మీరు చేస్తే రైతుల శాపనార్ధాలు పెడుతున్నారని విమ‌ర్శించారు జ‌గ్గారెడ్డి.




Next Story