ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత మాదే: డిప్యూటీ సీఎం భట్టి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.
By Knakam Karthik
ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత మాదే: డిప్యూటీ సీఎం భట్టి
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత, సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మీ అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించారు. మీ వద్ద స్వీకరించిన సమాచారాన్ని కమిటీకి పలు దఫాలుగా వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి చేయలేకపోయాం, ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనదే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు.
గురువారం కేబినెట్ సమావేశం నేపథ్యంలో అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రజలకు చేయాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నిటితో పాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే కేబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో భాగంగానే మా ప్రభుత్వం రాగానే మొదటి తారీకునే జీతాలు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్త పథకాలు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చాం. విజయవంతంగా అమలు చేస్తున్నాం వీటికి తోడు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్న తపనలో ప్రజా ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకు పోతున్నాం. అదే నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నాం ఈ కసరత్తు విజయవంతం కావాలని మనసున్న ప్రభుత్వం కోరుకుంటుందని వివరించారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.